Rajsri 143's Album: Wall Photos

Photo 152 of 316 in Wall Photos

*శ్రీసాయి సచ్చరిత్ర*

*సమాధిమందిర నిర్మాణము*
బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. “బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని.” వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడా వయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును.” అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీథర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు “నన్ను రాతి మందిరములో నుంచుడు.” అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక యందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.